న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వాక్ స్వాతంత్ర్యం అనే విలువలను రాజ్యాంగం నుంచి నేర్చుకున్నామని ఖర్గే చెప్పారు. కానీ కొన్ని పార్టీలు మాత్రం రాజ్యాంగ విలువలను దెబ్బతీయాలని, వాటిని తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్నాయని ప్రధానంగా బీజేపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఆ కొన్ని పార్టీలకు రాజ్యాంగ విలువలను అదుపులో పెట్టుకునే సమయమే వస్తే.. అప్పుడు ఆ రాజ్యాంగ విలువలే కనుమరుగైపోతాయని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఏదేమైనా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మనందరిపై ఉన్నదని దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పారు.
భారత్ జోడో యాత్ర ఇంకా కొనసాగుతున్నదని, ఇది ఎన్నికల కోసమో లేక ఓట్ల కోసమో జరుగుతున్న యాత్ర కాదని ఖర్గే అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కొన్ని దుష్ఠ శక్తులకు (బీజేపీకి) వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని ఆయన తెలిపారు.