(ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి):కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వెళ్లిపోయినప్పటికీ ఆ పార్టీలో గులాంనబీ ఆజాద్ రాజేసిన ముసలం సద్దుమణగటం లేదు. రెండేండ్ల క్రితం ఆజాద్ నాయకత్వంలో అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన జీ-23 నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లి ఆజాద్ను కలుస్తుండటంతో.. అసలు కాంగ్రెస్కు దిక్కూమొక్కు ఉన్నదా? దశ.. దిశను నిర్దేశించేవారు ఉన్నారా? అని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆజాద్ను కలిసినవారిపై పార్టీలోని వారి రాజకీయ ప్రత్యర్థులు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయటం.. ఫిర్యాదుదారులపై జీ-23 నేతలు అంతే స్థాయిలో విమర్శలకు దిగటం.. ఈ పరిస్థితులను చక్కదిద్దటానికైనా ఒక్కరంటే ఒక్క గాంధీ కూడా ఇండియాలో లేకపోవటం పార్టీ దుస్థితికి అద్ధం పడుతున్నదని పేర్కొంటున్నారు.
హూడా-షెల్జా వార్
ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్.. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటే జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ నేతలు కూడా కొందరు పార్టీని వీడి వెళ్లారు. తాజాగా మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత పృథ్విరాజ్ చవాన్, హర్యానా నేత భూపీందర్ హూడా కూడా ఆజాద్ను ఆయన నివాసంలో కలిశారు. వీరంతా గ్రూప్-23 నేతలే కావటంతో వీరి భేటీ పార్టీలో సంచలనంగా మారింది. హూడాపై సోనియా కుటుంబానికి సన్నిహితురాలైన హర్యానా కాంగ్రెస్ నేత కుమారి షెల్జా ఏఐసీసీకి ఫిర్యాదు చేయటంతో వివాదం మరింత ముదిరింది. బహిరంగంగా రాహుల్గాంధీ పరువు తీసిన ఆజాద్ను కలవటం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన అని, హూడాకు వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఫిర్యాదు లేఖలో కోరారు. సోనియాగాంధీ తల్లి మరణిస్తే ఈ నేతలెవరూ కనీసం సంతాపం తెలుపుతూ ఒక్క బహిరంగ ప్రకటన కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పృథ్విరాజ్ చవాన్పై అంతకుముందే ఏఐసీసీకి ఫిర్యాదు అందింది.
తగ్గేదే లే.. అంటున్న సీనియర్లు
ఎన్ని ఫిర్యాదులు చేసినా, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేదే లే అన్నట్టుగా తిరుగుబాటు నేతలు వ్యవహరిస్తున్నారు. ఆజాద్ను కలవటాన్ని హూడా సమర్థించుకొన్నారు. ఆజాద్ తనకు ఎంతోకాలంగా సన్నిహితుడు కావటం వల్లనే కలిశానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీని ఇంతో అంతో కంట్రోల్ చేస్తున్న సోనియా కుటుంబం ప్రస్తుతం ఇటలీలో ఉన్నది. సోనియాగాంధీ తల్లి మరణించటంతో సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక కూడా అక్కడికి వెళ్లారు. రెండుమూడు రోజుల్లో రాహుల్గాంధీ తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉన్నది. సోనియా మరో 15 రోజులవరకు అక్కడే ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందనే సెటైర్లు పేలుతున్నాయి.