న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ త్రివర్ణ శోభితంగా మారింది. సైనిక సామర్థ్యాన్ని చాటిచెప్పేలా వాయుసేన విన్యాసాలు, దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శనతో పరేడ్ ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకునేలా సాగింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్ముకశ్మీర్ పోలీసు ఏఎస్ఐ బాబురామ్కు అశోక్ చక్ర పురస్కారం వరించింది. ఈ అవార్డును మరణానంతరం ప్రకటించగా.. ఆయన కుటుంబసభ్యులు స్వీకరించారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్పథ్లో గణతంత్ర పరేడ్ అట్టహాసంగా జరిగింది. గుర్రాలపై సైనికులు కూర్చొని చేసే 61 కావల్రీ రెజిమెంట్ మార్చ్తో ఈ పరేడ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలో అశ్వాలతో కూడిన ఏకైక కావల్రీ యూనిట్ ఇదే. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల్లో భాగంగా రాఫెల్, జాగ్వార్, సుఖోయ్ వంటి 75 యుద్ధ విమానాలు చేసిన ప్రత్యేక విన్యాసాలు అబ్బురపరిచాయి. 1971లో పాకిస్థాన్పై విజయానికి గుర్తుగా స్వర్ణీమ్ విజయ్ వర్ష్ పేరిట అప్పటి యుద్ధంలో కీలక పాత్ర పోషించిన సెంచూరియన్ ట్యాంక్, పీటీ-76 ట్యాంక్, 75/24 ప్యాక్ హోవిట్జర్, ఓటీ-62 టోపాజ్ ఆర్మడ్ పర్సనల్ క్యారియర్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. 15 రాష్ర్టాలకు చెందిన 480 మందికి పైగా డ్యాన్సర్లు, వివిధ రంగాలకు చెందిన వందలాది కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ సైనికుల యూనిఫాంలో చోటుచేసుకొన్న మార్పులు, ఆయుధాల నవీకరణపై ఆర్మీ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, త్రివిధ దళాల అధిపతులు, కేంద్రమంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా వరుసగా రెండో ఏడాది కూడా విదేశీ అతిథి హాజరుకాకుండానే వేడుకలు జరిగాయి. కేవలం 5 వేల మందిని మాత్రమే అనుమతించారు. ముఖానికి డబుల్ మాస్క్, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొన్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించారు. భౌతిక దూరం నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకొన్నారు. కరోనా పోరులో ముందుండి సేవలు చేస్తున్న స్వచ్ఛ్ఘర్, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు కారణంగా వేడుకలు అరగంట ఆలస్యంగా (ఉదయం 10.30 గంటలకు) ప్రారంభమయ్యాయి. దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన సైనికులకు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ అంతకుముందు నివాళులు అర్పించారు. పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులకు స్పష్టంగా కనిపించేలా పది పెద్ద ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేశారు.
30 ఏండ్ల తర్వాత..
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారం అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 30 ఏండ్ల తర్వాత ఈ దృశ్యం కనిపించడం విశేషం. అంతకుపూర్వం బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 1992లో లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేశారు. అయితే కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ప్రాబల్యం తీవ్రంగా ఉండటంతో టవర్పై మువ్వన్నెల రెపరెపలు కనుమరుగయ్యాయి. అయితే బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు క్రేన్ సాయంతో టవర్పై ఎక్కి జెండా ఎగురవేశారు. వీరికి భద్రతగా పోలీసులు వలయంగా నిలబడ్డారు.