న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సం సందర్భంగా జరిగిన సమావేశాల సమయంలో.. ఎంపీలకు కొత్త రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. అయితే ఆ రాజ్యాంగ కాపీల్లో .. సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరీ(Adhir Rajan Chowdhury) తెలిపారు. సెంట్రల్ విస్టాలో ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కొత్త రాజ్యాంగ కాపీలను అందజేశారని, కానీ ఆ పుస్తకాల్లో ఉన్న పీఠికలో సోషలిస్టు సెక్యూలర్ పదాలు లేవని అధిర్ ఆరోపించారు. సామ్యవాదం(సోషలిస్టు), లౌకికవాదం(సెక్యూలర్) పదాలు.. రాజ్యాంగ పీఠికలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను పీఠికలో జోడించామన్నారు. కానీ ఇప్పుడు ఉన్న రాజ్యాంగ పుస్తకంలో ఆ పదాలు లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశం అనుమానాస్పదంగా ఉందని, చాలా తెలివిగా ఈ పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని లేవనెత్తాలని చూశానని, కానీ తన అభ్యర్థనను పట్టించుకోలేదని ఆయన అన్నారు. భారత్ అన్నా.. ఇండియా అన్నా ఒక్కటేనని, పేరు కోసం రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం రెండు పేర్లలో తేడాలేదన్నారు.