ముంబై, జూలై 23: మహారాష్ట్రలో వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వరదలు, వాటి ఫలితంగా సంభవించిన ప్రమాదాలతో రెండు రోజుల్లోనే 129 మంది చనిపోయారు. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. శుక్రవారం కొండచరియలు విరగిపడిన ఘటనల్లో 60 మంది చనిపోయారు. 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఒక్క రాయ్గఢ్ జిల్లాలోనే మూడు వేర్వేరు ప్రమాదాల్లో 49 మంది చనిపోయారు. తలాయ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడటంతో 38 మంది చనిపోయారు. ప్రమాదస్థలికి వెళ్లే దారంతా బురద మేట వేయడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది. ఇదే జిల్లాలో పొలాడ్పూర్లో 11 మంది, సతారా జిల్లాలో ఆరుగురు, రత్నగిరి జిల్లాలో ముగ్గురు, చిప్లున్ తాలూకాలో ఇద్దరు మృతిచెందారు. ముంబైలో ఇల్లు కూలి ముగ్గురు మరణించారు.
మహాబలేశ్వర్లో ఆల్టైం రికార్డు!
సతారా జిల్లాలోని మహాబలేశ్వర్లో గురువారం నుంచి శుక్రవారం 8.30 గంటల వరకు 24 గంటల్లోనే 59.44 సెంటీమీటర్ల వాన కురిసింది. ఈ ప్రాంతంలో ఒక్కరోజులో ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో వర్షం కురవలేదని ఐఎండీ తెలిపింది. మహాబలేశ్వర్లో బుధవారం 48.2 సెంటీమీటర్లు, గురువారం 46.1 సెంటీమీటర్లు వాన పడింది. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతంలో ఏడాది సగటు వర్షపాతం 553 సెంటీమీటర్లు.
ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ఆరు జిల్లాలకు(రాయ్గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్, పుణె, సతారా, కొల్హాపూర్) భారత వాతావరణ విభాగం(ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీచేసింది. దక్షిణ భారతం, పశ్చిమ తీరంలో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, గోవా, సెంట్రల్ మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది.
నదిలో కొట్టుకుపోయిన బస్సు
కొల్హాపూర్లో ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో డ్రైవర్ సహా 11 మంది ఉన్నారు. భారీ వరద ఉన్న ప్రాంతంలో బస్సు నడుపుతుండటంతో పోలీసులు, అధికారులు డ్రైవర్ను హెచ్చరించారు. అయినా కూడా అతడు వినిపించుకోకుండా ముందుకుపోయాడు. బస్సు వరదలో చిక్కుకొన్నది. వెంటనే అధికారులు అందులో ఉన్నవారిని కాపాడారు. కొద్ది సెకన్లలోనే బస్సు కొట్టుకుపోయింది.
5లక్షలు ఎక్స్గ్రేషియా
కొండచరియలు విరిగి పడి చనిపోయినవారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రాయ్గఢ్లోని తలాయ్ గ్రామంలో 36 మంది చనిపోయిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కర్ణాటకలో ముగ్గురు మృతి
కర్ణాటకలో భారీ వర్షాలతో ఎనిమిది చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముగ్గురు చనిపోయారు. 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. 21 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తమిళనాడులోని మెట్టుపాలాయం జిల్లాలో భవానీ నది ఒడ్డున ఉండేవారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరిక జారీచేసింది.