జైపూర్: ఒక వ్యక్తిని పాము కాటేసింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నాడు. ఇంటికి వచ్చిన అతడ్ని ఆ పాము మళ్లీ కాటేసింది. (Snake bites man twice) దీంతో చికిత్స పొందుతూ మరణించాడు. విస్తూపోయే ఈ సంఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో జరిగింది. జూన్ 20న మెహ్రాన్గఢ్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల జసబ్ ఖాన్ మోకాలిపై పాము కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని పోఖ్రాన్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు నాలుగు రోజులపాటు చికిత్స అందించడంతో కోలుకున్నాడు. జూన్ 25న ఇంటికి తిరిగి వచ్చాడు.
కాగా, మరునాడు జసబ్ ఖాన్ను ఆ పాము మళ్లీ కాటేసింది. ఈసారి రెండో కాలుపై కాటు వేయడంతో కుటుంబ సభ్యులు అతడ్ని జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. పాము మొదటి కాటు విషం నుంచి జసబ్ ఖాన్ పూర్తిగా కోలుకోలేదని డాక్టర్లు తెలిపారు. ఆ పాము రెండోసారి కాటేయడం వల్ల అతడు చనిపోయినట్లు చెప్పారు.
మరోవైపు ఈ విషాద సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండుసార్లు పాము కాటు వల్ల మరణించిన జసబ్ ఖాన్కు తల్లి, భార్య, నలుగురు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. కాగా, జసబ్ ఖాన్ మరణానికి కారణమైన ఆ పామును అతడి కుటుంబ సభ్యులు చంపారు.