చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను స్మార్ట్ వాచ్తో గమనిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీని ద్వారా వారి హాజరును కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా స్మార్ట్ వాచీలు ధరించాలని ఆయన సూచించారు. శనివారం సోహ్నాలోని సర్మతల గ్రామంలో ‘వికాస్’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులంతా స్మార్ట్వాచ్లు ధరిస్తారు. కార్యాలయ సమయాల్లో వారి కదలికలను ఇది ట్రాక్ చేస్తుంది. అలాగే వారి హాజరును గుర్తించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు.
హాజరును తారుమారు చేసే లొసుగులను ఈ స్మార్ట్ వాచ్ తొలగిస్తుందని సీఎం ఖట్టర్ తెలిపారు. మునుపటి హాజరు పుస్తకంలో సంతకం, ప్రస్తుతం అమలు చేస్తున్న బయోమెట్రిక్ సిస్టమ్ అవసరం ఉండబోదని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని అన్నారు. నకిలీ, తప్పుడు హాజరుకు తావివ్వదన్నారు.
తాము ప్రవేశపెట్టే ఈ స్మార్ట్ వాచ్, సంబంధిత అధికారిని మాత్రమే ట్రాక్ చేస్తుందని ఖట్టర్ తెలిపారు. వేరెవరైనా ధరించినట్లయితే గడియారం పనిచేయడం ఆగిపోతుందని చెప్పారు. ఈ విధంగా హర్యానాలోని ప్రభుత్వ అధికారుల అందరి కదలికలను ట్రాక్ చేయవచ్చని అన్నారు.
మరోవైపు స్మార్ట్ వాచ్ హాజరు విధానాన్ని ప్రస్తుతం పంచకుల మున్సిపల్ కార్పొరేషన్, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లో అమలు చేస్తున్నారు. అయితే జీపీఎన్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్తో కూడిన ఈ స్మార్ట్ వాచ్ వల్ల తమ వ్యక్తిగత జీవితం, గోప్యతకు భంగం కలుగుతున్నదని ప్రభుత్వ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.