చెన్నై: మంత్రి కారుపైకి బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన రైఫిల్ మ్యాన్ డీ లక్ష్మణ్ చనిపోయారు. మదురై ఎయిర్పోర్ట్కు చేరిన ఆయన మృతదేహానికి తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఆ జిల్లా కలెక్టర్, మదురై మేయర్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నివాళి అర్పించారు.
కాగా, అక్కడకు తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా నివాళి కోసం తమను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రొటోకాల్ నిబంధనలు ఉంటాయంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు, ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా ఒక మహిళ తన చెప్పును మంత్రి కారుపైకి విసిరింది. అది కారు అద్దం వద్ద పడింది. వెంటనే స్పందించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను పక్కకు లాగారు. మంత్రి కారుపై చెప్పు విసిరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
మరోవైపు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ బీజేపీ తీరుపై మండిపడింది. మరణించిన జవాన్కు నివాళి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నించడంపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Video: Slipper hurled at TN Minister PTR's car in Madurai by BJP cadre#TamilNadu #Video pic.twitter.com/KIYRlZ4Pem
— TheNewsMinute (@thenewsminute) August 13, 2022