న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం మంగళవారం జరుగనున్నది. ఈ సందర్భంగా ఉద్యమ భవిష్యత్పై రైతు సంఘాల నేతలు ఉదయం 11 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. ఎంఎస్పీ, వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ సహా పెండింగ్లో ఉన్న డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎస్కేఎం శనివారం ఐదుగురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే, మిగతా డిమాండ్లను సైతం నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐదుగురు సభ్యుల కమిటీ పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నది. గతంలో ప్రభుత్వంతో అనధికారిక చర్చలు జరిగాయి.
అయితే, కేసుల ఉపసంహరణ, ఎంఎస్పీపై చట్టపరమైన హామీతో సహా సమస్యల పరిష్కారానికి రాతపూర్వక హామీ కోరుకుంటున్నట్లు ఓ రైతు నాయకుడు పేర్కొన్నారు. శనివారం ఎస్కేఎస్ సమావేశమైన అనంతరం రైతు నాయకులు బల్బీర్సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్, యుధ్వీర్ సింగ్లను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. గత నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 21న ఎంఎస్పీ, రైతులకు పరిహారం సహా ఆరు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి రైతు సంఘాలు లేఖ రాసింది.