న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. ఈ నెల 25న దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బాలికపై కాల్పులు ఎందుకు జరిపారన్న ప్రశ్నకు నిందితులు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ గురయ్యారు. నిందితుల్లో ఒకరితో బాలిక సోషల్ మీడియాలో చాటింగ్ చేసేదని, ఆ తర్వాత సడెన్గా ఆమె చాట్ చేయడం మానేయడంతో కక్ష పెంచుకుని, స్నేహితులతో కలిసి కాల్పులు జరిపాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఆర్మాన్ అలీ అనే వ్యక్తికి బాధిత బాలికతో గత రెండేండ్లుగా సోషల్ మీడియాలో పరిచయం ఉంది. వాళ్లు నిత్యం చాటింగ్ చేసుకునేవారు. అయితే ఇటీవల బాలిక ఆర్మాన్తో చాటింగ్ చేయడం మానేసింది. దాంతో బాలికపై కక్ష పెంచుకున్న ఆర్మాన్.. స్నేహితులు బబ్బి, పవన్తో కలిసి కాల్పులకు ప్లాన్ చేసి అమలు జరిపాడు. ఈ కాల్పుల్లో బాలిక భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రాణపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు.