చండీగఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్లో ఓ ఆరేళ్ల బాలుడు 300 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. బాలుడి తల్లిదండ్రులు పొలంలో పని చేస్తుండగా.. బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కుక్క బాలుడి వెంట పడింది. దాని నుంచి తప్పించుకునేందుకు బాలుడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
రెండు అడుగుల ఎత్తు ఉన్న బోరుబావి కనిపించడంతో పైపును ఎక్కేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు అందులోనే పడిపోయాడు. బోరుబావు సుమారు 300 అడుగుల లోతు ఉంటుందని, బోర్వెల్ మోటార్ పని చేయకపోవడంతో మరమ్మతుల కోసం బయటకు తీసినట్లుగా తెలుస్తున్నది. అయితే, పైపుపై మూతను బిగించగా.. ఎవరో తీసుకెళ్లి ఉంటారని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న గడ్డివాలా పోలీసులు, చుట్టు పక్కల ప్రాంతాల జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 100 అడుగుల లోతులో చిన్నారి ఇరుక్కుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బోరుబావిలో చిక్కుకుపోయిన చిన్నారికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది.