న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. శాస్త్రి పార్క్ (Shastri Park) ఏరియాలోని ఓ ఇంట్లో రాత్రి భోజనం తర్వాత సంతోషంగా నిద్రపోయిన ఎనిమిది మంది కుటుంబసభ్యుల్లో తెల్లవారేసరికి ఆరుగురు విగతజీవులుగా మారారు. దోమల నుంచి రక్షణ కోసం ముట్టించిన దోమలబత్తే (Mosquito repellant) వారి పాలిట శాపమయ్యింది.
దోమలబత్తీ నుంచి వచ్చిన నిప్పు మిరుగులు బెడ్షీట్లపై పడి ఇళ్లంతా పొగలు వ్యాపించాయి. దాంతో ఊపిరాడక కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు పడుకున్న వాళ్లు పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక పసికందు (Toddler ) కూడా ఉంది. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
శాస్త్రిపార్క్ ఏరియాలో దోమలబత్తీ అంటుకుని పొగులు కమ్మడంతో ఒకే కుటుంబానికి చెందని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, వాళ్లలో ఒక చిన్నారి ఉందని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అదనపు పోలీస్ కమిషనర్ సంధ్యాస్వామి (Additional CP Sandhya Swamy) తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆమె వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.