ధన్బాద్: జార్ఖండ్లో ఘోరం జరిగింది. కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్బాద్ డివిజన్ పరిధిలోని నిచిత్పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) పోల్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పలువురికి విద్యుత్ షాక్ తగిలిందని, వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైల్వే అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ షాక్కు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.