అహ్మదాబాద్: పడవల్లో గుజరాత్ తీరానికి వచ్చిన పాక్ జాతీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 11 బోట్లను సీజ్ చేశారు. ఆరుగురు పాక్ జాతీయులను పట్టుకున్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 9న బుజ్లోని హరామీ నల్లా ప్రాంతానికి పలు పడవల్లో కొందరు పాక్ మత్స్యకారులు వచ్చారు. దేశంలోకి చొరబడేందుకు వారు ప్రయత్నించారు.
అయితే రాత్రి వేళ గస్తీ నిర్వహించే బీఎస్ఎఫ్ జవాన్లు దీనిని గ్రహించారు. డ్రోన్తో ఫొటోలు తీయగా కొన్ని పాక్ బోట్లు కనిపించాయి. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు బృందాలుగా ఏర్పడి హెలీకాప్టర్లలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పలు చోట్ల దాక్కున్న ఆరుగురు పాక్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. 11 బోట్లను సీజ్ చేశారు.
మరింత మంది పాక్ జాతీయులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత మత్స్యకారులను ఆ ప్రాంతంలోకి అనుమతించలేదన్నారు.