ముంబై : మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. జనరేటర్ నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కావడంతో ఊపిరాడక ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. దుర్గాపూర్లో నిన్న రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
భారీ వర్షాల కారణంగా దుర్గాపూర్లో సోమవారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రమేశ్ లష్కర్ అనే కాంట్రాక్టర్ తన ఇంట్లో ఉన్న జనరేటర్ను ఆన్ చేసి నిద్ర పోయారు. అయితే తెల్లారిన కూడా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఆ ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. రమేశ్ కుటుంబంలోని ఆరుగురు విగతజీవులుగా కనిపించారు. ఇల్లు తెరిచిన సమయంలో ఇంటి నిండా విష వాయువు దట్టంగా అలుముకుని ఉందని స్థానికులు పేర్కొన్నారు. జనరేటర్ నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కావడంతో, ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.