న్యూఢిల్లీ, నవంబర్ 22: అస్సాం, మేఘాలయ రాష్ర్టాల సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఫారెస్ట్ గార్డ్సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాం ఫారెస్ట్ గార్డులు జరిపిన కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు పౌరులు చనిపోయారు.
రెండు రాష్ర్టాల సరిహద్దులోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లా నుంచి రాత్రి 3 గంటల ప్రాంతంలో కలపతో వెళ్తున్న లారీని నిలువరించే క్రమంలో ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరిపారు. కాల్పుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మేఘాలయ ప్రభుత్వం ఏడు జిల్లాలో 48 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అస్సాం, మేఘాలయ రాష్ర్టాల మధ్య 884.9 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రాంతాలకు సంబంధించి అస్సాం సీఎం బిశ్వశర్మ, మేఘాలయ సీఎం సంగ్మా మధ్య గత మార్చిలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. మిగిలిన ఆరు ప్రాంతాలపై చర్చలు జరుగాల్సి ఉన్నది.