Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక దేవాలయం గోడ కూలి ఆరుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, జాట్ తాలూకా, మోతేవాడి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా మర్గుబాయ్ దేవి యాత్ర సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు భక్తులు గుడి ప్రాంగణంలో గుమిగూడారు.
ఈ సమయంలో భారీ వర్షం, వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా అక్కడి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో చాలా మంది భక్తులు గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గోడ కూలడంతో గాయాలపాలై ఆరుగురు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ముగ్గురు స్థానిక గ్రామస్తులు కాగా, మిగతా ముగ్గురు బీజాపూర్ తాలూకాకు చెందిన వారు. మంగళవారం ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారని, ఘటన జరిగిన సమయంలో 350 మందికిపైగా భక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సాంగ్లి ఎస్పీ తెలిపారు.