Modi-Biden Talks | ఉక్రెయిన్లో పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి జో బైడెన్తో ప్రధాని మోదీ వర్చువల్గా సమావేశమయ్యారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా దేశానికి తరలించామని చెప్పారు. భారతీయుల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో మాట్లాడి సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేశామన్నారు.
ఉక్రెయిన్లోని బుచాలో మారణ కాండను ఖండిస్తున్నామని మోదీ చెప్పారు. అమాయకుల ఊచకోత ఆందోళనకరం అని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు జరుగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జెలెన్స్కీ, పుతిన్లను కోరామని తెలిపారు. కీలక సమయంలో జో బైడెన్తో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్కు భారత్ అదనంగా ఔషధాలు పంపుతుందని హామీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా, భారత్ తమ సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంటాయన్నారు. ఉక్రెయిన్కు భారత్ ప్రకటించిన మానవతా మద్దతును స్వాగతించారు. నిరంతర సంప్రదింపుల ద్వారా భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు.
భారత్-అమెరికా లక్ష్యాల్లో సారూప్యతలు ఉన్నాయని బైడెన్ అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో బలమైన బంధం ఉందని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతోపాటు కొవిడ్-19 మహమ్మారి, భూతాప సమస్య, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.