బెంగళూరు: సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి (29).. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆ పిటిషన్పై విచారణ చేపట్టింది.
సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని, కాబట్టి సోదరుడి మరణానంతరం అతడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింది ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజ్యంగ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే తల్లీ, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమేనని, మేజర్లు అయిన తర్వాత సోదరుడు, సోదరి ఒకే కుటుంబసభ్యులుగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.