డెహ్రాడున్, ఫిబ్రవరి 6: ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే చట్టం అంటూ ఎంతో కాలంగా నినదిస్తున్న బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు ఎట్టకేలకు తమ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (యూసీసీ)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దేశంలో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనుంది.
కీలకమైన లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందితే.. బీజేపీ నేతృత్వంలోని అస్సాం, గుజరాత్ వంటి ఇతర రాష్ర్టాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ బిల్లు నుంచి గిరిజనులకు మినహాయింపునిచ్చింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ మంగళవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పౌరులందరికీ వారి మతాలతో నిమిత్తం లేకుండా.. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం అంశాలలో ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సహజీవనం చేసే జంటలు తప్పనిసరిగా ఆ విషయాన్ని అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.
ఈ బిల్లును మంగళవారం రోజే ఆమోదించాలని భావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలపడంతో స్పీకర్ వాయిదా వేశారు. ఈ బిల్లును అధ్యయనం చేయాల్సి ఉన్నదని, ఆ తరువాత తమ అభిప్రాయాలు తెలుపుతామని, అంతవరకు వాయిదా వేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ అందుకు అనుమతించారు. ఈ బిల్లు ఉత్తరాఖండ్లో నివసిస్తున్న వారికి, రాష్ట్రం వెలుపులనున్న రాష్ట్ర వాసులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.
సహజీవనాన్ని రిజస్టర్ చేయాలి
ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు సహజీవనానికి ఆమోదం తెలుపుతూనే జంటల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. ఇక 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్కు కల్పించారు.
తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా.. వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్కు తెలపాలి.