హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం సింగరేణి సంస్థ ఉన్నతాధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించింది. నైనీ బొగ్గు బ్లాకు రెండో దశకు అటవీ భూములు కేటాయించాలని, న్యూ పాత్రపద బొగ్గు బ్లాక్కు సంబంధించిన భూసేకరణకు సహకరించాలని ఈ బృందం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఒడిశా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. ఒడిశాలో పర్యటించిన వారిలో సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్, మైనింగ్ అడ్వయిజర్ డీ ఎన్ ప్రసాద్, కోల్మూమెంట్ ఈడీ జే ఆల్విన్, నైనీ బ్లాక్ అడ్వయిజర్ విజయరావు, జీఎం ఎం సురేశ్ ఉన్నారు. నైనీ బ్లాకుకు అనుబంధంగా అంగూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అత్యాధునిక బొగ్గు విశ్లేషణ కేంద్రాన్ని డైరెక్టర్ ఎన్ బలరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల బృందం ల్యాబోరేటరీ ప్రాంగణంలో మొకలు నాటారు.