Zubeen Garg : సింగపూర్లో అనుమానాస్పదంగా మరణించిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ కోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది. జుబీన్ గార్గ్ మరణం హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఒక కల్చరల్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇచ్చేందుకు సింగపూర్ వెళ్లిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19, 2025న అనుమానాస్పదంగా మరణించారు. ఒక చిన్న పడవలోంచి సముద్రంలో పడి మునిగిపోయి, మరణించాడు.
అయితే, జుబీన్ మృతిపై అతడి భార్య గరిమా సైకియా గార్గ్ అనుమానం వ్యక్తం చేశారు. అతడి మృతి వెనుక కుట్ర కోణం ఉండొచ్చని తెలిపింది. దీంతో ఈ కేసుపై సింగపూర్కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్స్ (పీసీజీ) బృందం విచారణ చేసింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు పడవ ఎక్కేముందు ఆల్కహాల్ తీసుకున్నాడు. అలాగే, నిలకడలేకుండా మత్తులో ఉన్నాడు. పడవ ఎక్కేముందు అతడు లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ, తర్వాత ఎప్పుడో తీసేశాడు. ఈ క్రమంలో పడవలోంచి నీళ్లలోపడి మునిగిపోయాడు. అతడు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని, ఎవరూ తోసేయలేదని, ఎలాంటి కుట్ర లేదని పీసీజీ కోర్టుకు తెలిపింది. అలాగే, స్విమ్మర్లు కూడా అతడిని రక్షించి, అతడి ముఖాన్ని నీళ్లలో ముంచారనడానికి కూడా సరైన ఆధారాలు లేవన్నారు. ఇక, ప్రభుత్వ వైద్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రాష్ట్ర వైద్యాధికారి ఆడమ్ నఖోడా కూడా జుబీన్ నీటిలో మునిగిపోవడం వల్లే మరణించినట్లు కోర్టుకు తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు.
పీసీజీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిందన్నాడు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇండియా-సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జుబీన్ సింగపూర్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు మరణించాడు. దీంతో ఈ ప్రోగ్రాంను నిర్వాహకులు రద్దు చేశారు.