న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది. పీఎఫ్ఐకి చెందిన 106 మందిని అరెస్ట్ చేసింది. 15 రాష్ర్టాల్లోని 93 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎమ్ఏ సలాంను కూడా అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్ఐఏ చరిత్రలోనే అతిపెద్ద దర్యాప్తుగా దీన్ని పేర్కొంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా సోదాల్లో పాల్గొన్నది. కేరళలో 22, మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, అస్సాంలో 9, ఉత్తరప్రదేశ్లో 8, ఆంధ్రప్రదేశ్లో 5, మధ్యప్రదేశ్లో 4, పుదుచ్చేరిలో 3, ఢిల్లీలో 3, రాజస్థాన్లో ఇద్దరిని అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అరెస్టులకు నిరసనగా కేరళలో ధర్నాలు చేపడతామని పీఎఫ్ఐ రాష్ట్ర యూనిట్ పేర్కొన్నది.
కేరళలో 2006లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. ఉగ్రవాద సంస్థలతో సంబంధం పెట్టుకొని, వాటికి నిధులు సమకూర్చటం, శిక్షణలో సాయం అందించటం, తీవ్రవాద సంస్థల్లో చేర్చటం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నదని ఎన్ఐఏ ఆరోపిస్తున్నది. ఈ సంస్థ దుబాయ్, ఒమన్, కతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, నిధులు వసూలు చేసి హవాలా మార్గంలో భారత్కు తరలించిందని వెల్లడించింది. మనీ లాండరింగ్కు పాల్పడుతున్నదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంస్థపై ఈడీ తొలి కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఎన్ఐఏ.. తెలంగాణలో ఒకరిని అరెస్టు చేసింది. రాష్ట్రం నుంచి అబ్దుల్ వారిస్ అనే పీఎఫ్ఐ సభ్యుడిని అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కాగా, ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా కొందరు యువకులకు పీఎఫ్ఐ శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించి జూలైలో నిజామాబాద్లో కొందరు పీఎఫ్ఐ నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. పీఎఫ్ఐపై దేశవ్యాప్తంగా 5 కేసులు నమోదు చేసింది.
గురువారం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న పీఎఫ్ఐ కార్యాలయంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సోదాలు చేపట్టిన అధికారులు.. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకొని, కార్యాలయాన్ని సీజ్ చేశారు.