న్యూఢిల్లీ : భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ముమ్మరం కానుంది. సెప్టెంబర్లో 20 కోట్ల కొవిషీల్డ్ డోసులను కేంద్ర ప్రభుత్వానికి, ప్రైవేట్ దవాఖానలకు సరఫరా చేస్తామని పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది. ఆగస్ట్లో ఇప్పటివరకూ ఎస్ఐఐ 12 కోట్ల కొవిషీల్డ్ డోసులు సరఫరా చేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత పెంచామని, సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ దవాఖానలకు దాదాపు 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్రానికి నివేదించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు సవాళ్లు ఎదురవుతున్నా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు తాము రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని ప్రకాష్ కుమార్ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
మేలో 6.5 కోట్ల డోసులు ఉత్పత్తి చేసిన ఎస్ఐఐ క్రమంగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల సామర్ధ్యానికి ఎదిగింది. దీంతో సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.