న్యూఢిల్లీ, జూన్ 4: ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ కుట్ర కోణంతో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ట్యాంపరింగ్ కూడా జరిగి ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ ట్యాంపరింగ్ లోపల వ్యక్తులు చేశారా? లేక బయట నుంచి చేశారా? అనేది తేలాల్సి ఉన్నదని, ఈ రెండు కోణాల్లో దేనినీ తోసి పుచ్చలేమని అన్నారు. మరోవైపు ఘటనాస్థలిలో దర్యాప్తు పూర్తి చేసిన రైల్వే సేఫ్టీ కమిషనర్(సీఆర్ఎస్) తన విచారణలో భాగంగా సోమ, మంగళవారాల్లో సాక్షులను కలువనున్నారని సౌత్ ఈస్టర్న్ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నది.
మరోవైపు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, పలువురు రైల్వే అధికారులు ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని వెల్లడించారు. ‘ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ అండ్ పాయింట్ మెషిన్’ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ప్రమాదం చోటుచేసుకొన్నదనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు వారు తెలిపారు. ఈ ‘క్రిమినల్’ చర్యకు పాల్పడిన వారిని కూడా గుర్తించామని పేర్కొన్న ఆయన.. వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఒడిశా రైలు దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు పూర్తి చేశారని, తుది నివేదిక సమర్పించాల్సి ఉన్నదని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు.
లోకోపైలట్ తప్పిదం లేదు..
రైలు ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ తప్పిదం లేదని రైల్వే బోర్డు ఉన్నతాధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత రైలును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడని తెలిపారు. అతి వేగంగా కూడా వెళ్లలేదని, ఆ ప్రాంతంలో గరిష్ఠ వేగం గంటలకు 130 కిలోమీటర్లు ఉండగా, అతను రైలును 128 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చాడని వివరించారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయాల పాలైన డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.