చండీగఢ్: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య (Sidhu Moose Wala Murder) కోసం నిందితులు ఉత్తరప్రదేశ్లో ప్లాన్ చేశారు. అలాగే హత్యకు వినియోగించిన ఆయుధాలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ షాకింగ్ విషయాలు దర్యాప్తులో తేలాయి. గత ఏడాది మే 29న పంజాబ్ మాన్సా జిల్లాలో వాహనంలో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాపై కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆయన హత్యకు ముందు ఈ కేసులోని నిందితులైన బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఉత్తరప్రదేశ్లో రాజధాని లక్నోతోపాటు అయోధ్యను సందర్శించారు.
కాగా, తొలుత ఒక కుంభకోణంలో భాగమైన యూపీకి చెందిన పెద్ద నేరస్తుడ్ని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. అయితే ఆ వ్యక్తి హత్యకు పన్నిన కుట్ర విఫలమైంది. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలాను లక్ష్యంగా చేసుకున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టి కాల్చి చంపారు.
మరోవైపు మూసే వాలా హత్యకు ముందు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు సచిన్ థాపన్ బిష్ణోయ్, సచిన్ భివానీ, కపిల్ పండిట్ ఉత్తరప్రదేశ్లో తిరిగారు. స్థానిక నేత వికాస్ సింగ్కు చెందిన అయోధ్యలోని ఫార్మ్హౌస్లో పలు రోజులు ఉన్నారు. సంబంధిత ఫొటో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే హత్యకు వారు వినియోగించిన ఆయుధాలు, ప్రత్యేకించి పిస్టల్స్ను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బిష్ణోయ్ గ్యాంగ్ సహచరులను గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే కేసు దర్యాప్తు కోసం నిందితుడు థాపన్ను ఢిల్లీ పోలీసులు అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు.