భోపాల్: మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దశ్మత్ రావత్ అనే గిరిజన కూలీపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఈ నెల 4న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నెల 5న నిందితుడు పర్వేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు.
జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఈ నెల 6న బాధితుడు దశ్మత్ రావత్ కాళ్లు కడిగాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతనికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. అంతేగాక రావత్ తన ఇంటిని మెరుగుపర్చుకోవడం మరో రూ.1.5 లక్షలు కేటాయించింది. ఈ నేపథ్యంలో బాధితుడు రావత్.. నిందితుడు పర్వేశ్ శుక్లాను విడుదల చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
జరిగిందేదో జరిగిపోయిందని, నిందితుడు ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నాడని, కాబట్టి అతడిని వదిలేయాలని కోరాడు. పైగా నిందితుడు శుక్లా మా గ్రామంలో పండితుడని, గ్రామానికి ఆయన అవసరం చాలా ఉందని, కాబట్టి ఆయనను వదిలిపెట్టాలని అభ్యర్థించాడు. మరి బాధితుడు దశ్మత్ రావత్ వినతిపై మధ్యప్రదేశ్ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.