కాంగ్రెస్ అధిష్ఠానం నవజ్యోత్ సింగ్ సిద్దూకే జై కొట్టింది. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని అధిష్ఠానం ప్రకటించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి సిద్దూయే చైర్మన్. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ కమిటీలో కేవలం సభ్యుడు మాత్రమే. ఇది గమనించాల్సిన పరిణామం. ఇక ప్రచార కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత సునీల్ జాఖడే నియమితులయ్యారు. మరో సీనియర్ నాయకురాలు అంబికా సోనీ సమన్వయ సమితికి అధ్యక్షురాలిగా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రతాప్ సింగ్ బాజ్వాను నియమించింది అధిష్ఠానం. అయితే చాలా మంది సీనియర్లకు అధిష్ఠానం ఈ కమిటీలో చోటు కల్పించింది.
చాలా రోజుల పాటు పంజాబ్ కాంగ్రెస్ గ్రూపు తగాదాలతో సతమతమైంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూకు అస్సలు పడేదే కాదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. చాలా సార్లు అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. చివరికి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీని వీడి వెళ్లిపోయారు. అంతేగానీ.. సిద్దూ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. అయితే సిద్దూకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఓపెన్ సీక్రెట్. అయితే బాధ్యతల విషయంలోనే కాస్త అటు ఇటుగా నడిచింది వ్యవహారం. ఎన్నికల కమిటీకి సిద్దూ చైర్మన్గా ఉంటారని అధిష్ఠానం ప్రకటించడంతో సిద్దూ రాజకీయ జీవితంపై కమ్ముకున్న నీలినీడలు కాస్త తొలిగిపోయాయి.