బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కర్నాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. మేకేదాటు పాదయాత్రతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ మేరకు ఈ నెల 24న మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ.. హెచ్చరికలు జారీ చేసినా ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పది రోజుల పాటు మేకేదాటు పాదయాత్రను నిర్వహించింది. ‘మన నీరు – మనహక్కు’ అనే అంశంతో డీకే శివకుమార్తో కలిసి సిద్ధరామయ్య పాదయాత్రలో పాల్గొన్నారు.
రామనగర జిల్లా కనకపురలో కావేరి, అర్కావతి నదుల సంగమ ప్రాంతం వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. 139 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగిన యాత్ర కనకపుర, రామనగర, బిడాడి మీదుగా బెంగళూరులోని బసవనగుడి వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర కాంగ్రెస్ ఆగస్ట్ 9న మరో పాదయాత్రను నిర్వహించనున్నది. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర జరుగనున్నది. కల్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, మల్నాడ, ఓల్డ్ మైసూర్ తదితర ప్రాంతాల గుండా పాదయాత్ర సాగుతుంది. యాత్రకు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే నేతృత్వం వహించనున్నారు.