Siddaramaiah : హిందూ ప్రార్ధనా సంస్ధలు, దేవాదాయ, ధర్మాదాయ బిల్లుకు కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సవరణలపై ప్రజలను బీజేపీ తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తోందని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మతపరంగా విభజించేందుకే బీజేపీ దుష్ప్రచారం సాగిస్తోందని సీఎం దుయ్యబట్టారు. రూ. కోటి ఆదాయం దాటిన దేవాలయాల నుంచి పది శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ 1 కోటి మధ్య ఆదాయం కలిగిన ఆలయాల నుంచి 5 శాతం పన్ను వసూలుకు ఈ బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది.
1997లో ఈ చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి ఉమ్మడి నిధి ఏర్పాటుకు అవకాశం ఉందని గుర్తుచేశారు. ఉమ్మడి నిధికి సమకూరే నిధులను పెంచేందుకు మాత్రమే తాజా సవరణ చేపట్టారని సీఎం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. దేశ యువత తమ ఉద్యోగాలను విడిచిపెట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఊహాజనిత యుద్ధంలో పోరాడాలని ఆ పార్టీ కోరుకుంటోందని సిద్ధరామయ్య ఆరోపించారు. కాగా, ఖజానాను నింపుకునేందుకు కర్నాటక ప్రభుత్వం ఆలయాల రాబడిపై కన్నేసిందని కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్ధలు, దేవాదాయ (సవరణ) బిల్లును సభ ఆమోదం పొందిన క్రమంలో బీజేపీ సిద్ధరామయ్య సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడింది. ఖాళీ ఖజానాను ఆలయ నిధులతో పూడ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందని దుయ్యబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను మంత్రి రామలింగారెడ్డి సమర్ధించారు. రూ. 10 లక్షల ఆదాయం దాటిన ఆలయాల నుంచి నిధుల వసూలు సబబేనని అన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల మెరుగుకోసం ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తం ధార్మిక పరిషత్కు కేటాయించడం 2003 నుంచి జరుగుతున్నదేనని మంత్రి వివరించారు.
Read More :
ED Raids: బెంగాల్లో పీడీఎస్ స్కామ్.. ఆరు చోట్ల ఈడీ సోదాలు