బెంగళూర్ : కర్నాటక (Karnataka Polls) సీఎం రేసులో ఉన్నానని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీఎం పదవికి తనతో పోటీ పడుతున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. తాను నూరు శాతం సీఎం అభ్యర్ధినేనని, ఇప్పుడున్న పరిస్ధితుల్లో తనతో పాటు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారని, అయితే జీ పరమేశ్వర కూడా సీఎం పదవిని ఆశిస్తున్నానని గతంలో ప్రస్తావించారని పేర్కొన్నారు.
సీఎం అభ్యర్ధిత్వానికి తనతో పోటీ పడే వారితో ఎలాంటి సమస్యలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. మేలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోలార్తో పాటు వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తానని సిద్ధరామయ్య తెలిపారు. డీకే శివకుమార్తో తనకు మెరుగైన సంబంధాలే ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని చెప్పారు. సీఎం అభ్యర్ధిని కాంగ్రెస్ ఎన్నడూ ఎన్నికలకు ముందు ప్రకటించలేదని ఓ ప్రశ్నకు బదులిస్తూ సిద్ధరామయ్య చెప్పారు.
హైకమాండ్ సూచలనతో పాటు ఎమ్మెల్యేల అభీష్టం ప్రకారం సీఎల్పీ నేత ఎంపిక ఉంటుందని అన్నారు. ఇక ఇవే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ప్రధాన ప్రత్యర్ధులుగా తలపడనున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, బొమ్మై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాలనా పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తోంది. మరోవైపు గణనీయ సంఖ్యలో సీట్లు దక్కించుకుని కింగ్మేకర్గా నిలిచేందుకు జేడీ(ఎస్) వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
Read More