ఇస్లామాబాద్, మే 18: దేశవిభజన ఆ సిక్కు కుటుంబాన్ని వేరుచేసింది. ఒక్క తల్లి పిల్లలు చెల్లాచెదురయ్యారు. 75 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. సోదరి పాక్ పంజాబ్లో ముస్లింల ఇంట పెరిగింది. సోదరులు ఇండియా పంజాబ్లో నెట్టుకొచ్చారు. అప్పట్లో పసికందు అయిన సోదరి మతకల్లోలాల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లి మృతదేహం మీద తారాడుతుండగా ముహమ్మద్ ఇక్బాల్, అల్లారఖీ దంపతులు తమవెంట పాకిస్థాన్ తీసుకుపోయారు.
షేఖూపూరా జిల్లా వారికాతియాన్లో స్థిరపడ్డారు. పాపకు ముంతాజ్ బీబీ అని పేరుపెట్టి తమ సొంత కూతురిలా పెంచుకున్నారు. రెండేండ్ల క్రితం హఠాత్తుగా జబ్బు పడ్డప్పుడు ఇక్బాల్ ఆమెకు అసలు నిజం చెప్పారు. ఆయన మరణం తర్వాత ముంతాజ్ తల్లి, తమ్ముడు సోషల్ మీడియా ద్వారా పాటియాలాలో ఉన్న సిక్కు కుటుంబం ఆచూకీ తీశారు. 75 ఏండ్ల తరువాత పాక్ సరిహద్దుల్లో ముంతాజ్ తన సోదరులను కలుసుకున్నారు. ఈ ఉద్విగ్న ఘట్టానికి కర్తార్పూర్ కారిడార్లోని సాహిబ్ వేదికైంది.