న్యూఢిల్లీ: బంబుల్ డేట్ యాప్లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్ కలిసిందని, ఈ అంశంపై తమ మధ్య జరిగిన గొడవ వల్లనే ఆమెను హత్యను చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా పోలీసులకు తెలిపాడు. ఈ ఏడాది మే 18న సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ను ఆఫ్తాబ్ హత్య చేయడంతోపాటు చైనా కత్తితో ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను ఫ్రిజ్లో దాచి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్యా సంఘటన సంచలనం రేపింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు ఇటీవల నిందితుడు ఆఫ్తాబ్కు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఆఫ్తాబ్ వెల్లడించిన అంశాలు బహిర్గతమయ్యాయి.
బంబుల్ డేట్ యాప్లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్ మే 17న గురుగ్రామ్లో కలిసిందని నిందితుడు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మరునాడు మధ్యాహ్నం ఆమె తమ ఫ్లాట్కు తిరిగి వచ్చిందని చెప్పాడు. ఈ అంశంపై తమ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమె గొంతునొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో పేర్కొన్నాడు. కొంత కాలంగా తాము సన్నిహితంగా కాకుండా కేవలం రూమ్మేట్స్గా నివసిస్తున్నట్లు అతడు వెల్లడించాడు.
మరోవైపు శ్రద్ధా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డాటా ఆధారంగా ఢిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అలాగే బంబుల్ డేట్ యాప్కు లేఖ రాసి ఆమె కలిసిన వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే గురుగ్రామ్లో శ్రద్ధా కలిసిన వ్యక్తి వివరాలు బయటపెట్టలేదు. మే 19న ముంబై వెళ్లేందుకు ఆఫ్తాబ్ ప్లాన్ చేసుకున్నాడని, అయితే శ్రద్ధా హత్య నేపథ్యంలో దానిని రద్దు చేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.