ముంబై/న్యూఢిల్లీ, డిసెంబర్ 26: టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె ప్రియుడు షీజన్ ఖాన్(28) పోలీస్ కస్టడీలో తొలి రోజే నోరు విప్పాడు. ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతో కలవరపెట్టాయని, అందుకే తునిషాతో బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని షీజన్ వెల్లడించినట్టు సమాచారం. వేర్వేరు మతాలకు చెందిన తమ మధ్య వయసులో కూడా చాలా తేడా ఉండటం భవిష్యత్తులో అడ్డుగా మారొచ్చని తునిషా (20)తో చెప్పానని నిందితుడు పేర్కొన్నట్టు తెలుస్తున్నది. దాదాపు 15 రోజుల క్రితం షీజన్ బ్రేకప్ చెప్పటంతో తునిషా మనోవేదనకు గురై శనివారం ముంబై సమీపంలోని ఓ సీరియల్ షూటింగ్ సెట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే అంతకుముందు కూడా తునిషా ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తానే కాపాడానని, తునిషాను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ఆమె తల్లికి చెప్పానని షీజన్ వివరించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
శ్రద్ధా హత్య కేసులో కీలక వీడియో లభ్యం
ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో కీలకమైన వీడియోను పోలీసులు సోమవారం కనుగొన్నారు. తనను కొట్టవద్దంటూ శ్రద్ధా.. ఆఫ్తాబ్తో గొడవపడ్డ వీడియో పోలీసుల చేతికి దొరికిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడింది. ఈ వీడియో ముంబైలో రికార్డయినట్టు తెలుస్తున్నది. కచ్చితమైన ఆధారం ఇదేనని వీడియోలో తేలితే నేరం రుజువు అవుతుందని ఏఎన్ఐకు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.