ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివసేన చీలికదశకు చేరగా, ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాత్రం చాలా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. ముంబైకి తిరిగి వచ్చి ధైర్యాన్ని ప్రదర్శించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలనుద్దేశించి అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలో ఉండి మాట్లాడటం సరికాదన్నారు. వారు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని సూచించారు.
ఎమ్మెల్యేలందరి అభీష్టం అదే అయితే ఎంవీఏ కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్ రౌత్ తెలిపారు. అయితే దాని కోసం రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని కోరారు. ఏక్నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేల్లో 22 మంది తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. ముంబైకి తిరిగి వస్తే వారు ఎలాంటి ఒత్తిడిలో తమను వీడాల్సి వచ్చిందో అన్నది చెబుతారని అన్నారు. ఈ విషయం కూడా త్వరలో బయటపడుతుందన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవిని లేదా శివసేన అధ్యక్ష పదవిని కోల్పోయే ప్రమాదం ఏమీ లేదని సంజయ్ రౌత్ అన్నారు. ఒకవేళ అసెంబ్లీలో బలపరీక్ష ఎదురైతే మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే, బుధవారం రాత్రి సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసిన అనంతరం భారీగా తరలివచ్చిన శివ సైనికులతో కలిసి సొంత నివాసం మాతోశ్రీకి చేరుతున్నారు. దీంతో గత రాత్రి ఒక సింహాన్ని మీరు రోడ్డుపై చూశారంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.