భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు చల్లారిన చాయ్ ఇచ్చినందుకు ప్రభుత్వాధికారికి షోకాజ్ నోటీస్ అందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లా ఖజురహో పర్యటనలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు నాణ్యత లేని చల్లని టీ అందించినందుకు జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కనౌహాకు రాజ్నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) డీపీ ద్వివేది షోకాజ్ నోటీసు అందించారు.
‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్.. రేవాకు వెళ్తుండగా సోమవారం ఖజురహో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో ఉన్న సమయంలో ఆయనకు, ఇతర అతిథులకు టీ అందించారు. అయితే, అది నాణ్యతలేకుండా చల్లగా ఉంది. సీఎం రిఫ్రెష్మెంట్ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన కనౌహా ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదు’ అని ఎస్డీఎం నోటీసుల్లో ఉంది. ”ఈ దుష్ప్రవర్తనకు సంబంధించి మీపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదో మాకు చెప్పండి’’ అని నోటీసుల్లో కనౌహాను ప్రశ్నించారు.
మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే ఏకపక్షంగా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ షోకాజ్ నోటీసు సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఛతర్పూర్ కలెక్టర్ సందీప్ జీఆర్ ఆ షోకాజ్ నోటీసును రద్దు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కలెక్టర్ పేర్కొన్నారు.