లక్నో: ఆవు పేడతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చంటూ గుజరాత్కు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం ఈ వీడియోపై స్పందించారు. ఇది చూసి మనం నవ్వాలా లేక ఏడ్వాలా అని వ్యాఖ్యానించారు.
ఆవు పేడ, మూత్రంతో రోగ నిరోధక శక్తిని పొందవచ్చని, కరోనా నుంచి కాపాడుకోవచ్చంటూ ఇటీవల కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దీని గురించి డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. కరోనాకు తప్పుడు చికిత్సా విధానాల వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గుజరాత్కు చెందిన కొందరికి బ్లాక్ ఫంగస్ సోకడానికి ఇవి కూడా కారణమని అంటున్నారు.
ఆవు పేడ లేదా మూత్రం కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న దానిపై ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధిపతి డాక్టర్ జె.ఎ.జయలాల్ వెల్లడించారు. ఆవుల మలమూత్రాలను ఉపయోగించడం వల్ల కొన్ని జూనోటిక్ లేదా అంటు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని, ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.