న్యూఢిల్లీ, మార్చి 21: కేంద్రీయ పాఠశాలల్లో ప్రవేశాలకు ఒక్కో విద్యాసంవత్సరంలో 10 మంది వరకు విద్యార్థులను సిఫారసు చేసేలా ఎంపీలకు కల్పించిన కోటాను తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నది. సోమవారం లోక్సభలో ఈ అంశం చర్చకు రావడంతో స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నది. కేంద్రీయ పాఠశాలల్లో అడ్మిషన్లకు భారీగా విజ్ఞప్తులు వస్తుడటంతో ఎంపీలకు కల్పించిన 10 సీట్ల కోటా సరిపోవట్లేదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీల కోటా పెంచాలని, లేదంటే తొలగించాలని కోరారు. దీంతో కోటా తొలగింపునకు సభ ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ ప్రతిపాదనను చాలా మంది ఎంపీలు వ్యతిరేకించారు.