Lawrence Bishnoi : మహారాష్ట్ర, పూనేలోని ఒక వ్యాపారి ఆఫీసు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పూనేలోని హెచ్ వికాస్ స్టీల్ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తెలుస్తోంది. పూనేలోని అమూల్ చమారియా, సన్నీ చమూరియా అనే ఇద్దరు వ్యాపారులు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. రాత్రిపూట ముసుగు ధరించిన దుండగులు.. పిస్టోల్తో ఆఫీసు సమీపంలో కాల్పులు జరిపారు.
చుట్టు పక్కలా, గోడలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున అర్జూ బిష్ణోయ్ శుభమ్ లోంకర్ పేరుతో ఉన్న ఒక అకౌంట్ నుంచి ప్రకటన వెలువడింది. తామే ఈ కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించారు. వ్యాపారులిద్దరూ చాలా మందిని మోసం చేసి, మనీ లాండరింగ్కు పాల్పడ్డట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై తమ గ్యాంగ్ ఫోన్ చేసి హెచ్చరిస్తుంటే, వారు తమను పట్టించుకోవడం లేదని, అందుకే ఈ కాల్పులు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో తమ కాల్స్కు స్పందించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ సారి బుల్లెట్లు గోడను తాకాయని, తాము చెప్పినట్లు వినకుంటే భవిష్యత్తులో వారి ఛాతీలో దిగుతాయని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీనికి సిద్ధంగా ఉండాలన్నారు.
అలాగే, కాల్పులకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియా పోస్టుతోపాటు, వీడియోపైనా ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. ఇటీవలి కాలంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుసార్లు దాడులకు పాల్పడింది. సెలబ్రిటీలతోపాటు అనేక మంది వ్యాపారుల ఇండ్ల వద్ద కాల్పులు జరుపుతోంది.