భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని భోపాల్ ’క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ’ వెల్లడించింది.
కర్ఫ్యూ సమయంలో నిత్యావసర సరుకుల సరఫరా, రవాణాకు మినహాయింపు ఉంటుంది. ఇది కేవలం కరోనా కర్ఫ్యూ మాత్రమేనని లాక్డౌన్ కాదని రాష్ట్ర మంత్రి విశ్వాస్ కైలాష్ సింగ్ స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ, దవాఖానాలు, పెట్రోల్ పంపులు, బ్యాంకులు, కిరాణా దుకాణాలు, అంబులెన్సులు, కార్మికుల సేవలు, వ్యవసాయ కార్యకలాపాలు యథావిథిగా సాగుతాయని అధికారులు పేర్కొన్నారు.