Shivaraj Singh : బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతున్నదని హేళనగా మాట్లాడారు.
రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని శివరాజ్సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ రెండు యాత్రలు చేశారని, ఆ రెండూ కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రలుగా మారాయని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్కు అన్యాయం చేస్తున్నారని, రాహుల్ యాత్ర చేసినప్పుడల్లా కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొంటోందని సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుచేశారు.
దేశ ప్రజల తరపున తాను నాలుగు ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పు అని రాహుల్ గాంధీని శివరాజ్ ప్రశ్నించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారో రాహుల్తో పాటు మల్లికార్జున్ ఖర్గే చెప్పగలరా..? అని అడిగారు. పశ్చిమబెంగాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.
ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం భారత సంస్కృతిలో లేదని, అది కాంగ్రెస్, ఇండియా కూటమి సంస్కృతిలో భాగమా అని శివరాజ్ ప్రశ్నించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ ఎందుకు పోటీ చేయడం లేదని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం ఆమెకు లేదా అని అడిగారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.