ముంబై: దేశంలో కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగైతేనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే లక్ష్మీదేవి, గణపతి, మహాత్మా గాంధీ చిత్రాలు కాదు.. మా ప్రాంత వీరుడి బొమ్మ అయితే కరెన్సీ నోటుపై సరిగ్గా సెట్ అవుతుందని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఏకంగా నోటుపై మహాత్మాగాంధీ స్థానంలో ఆ వీరుడి ఫొటోతో మార్ఫింగ్ చేసిన నోటును సోషల్ మీడియా షేర్ చేశారు.
కన్కావ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే.. మరాఠా యోధుడు శివాజీ ముఖచిత్రంతో ఉన్న రూ.200 నోటును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ (యే పర్ఫెక్ట్ హై) అంటూ పేర్కొన్నారు.
Ye perfect hai ! 😊 pic.twitter.com/GH6EMkYeSN
— nitesh rane (@NiteshNRane) October 26, 2022
ఇప్పుడున్న మహాత్మాగాంధీ చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నోటుకు మరోవైపు దేవతల చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. దేవతల చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతోపాటు ప్రపంచంలో భారత్కు విలువ పెరుగుతుందన్నారు.
కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రించాలన్న ప్రతిపాదనపై 2010లోనే ఆర్బీఐ నిపుణుల కమిటీని వేసింది. స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, ప్రముఖ క్రీడాకారులు, ఎంపిక చేసిన మేధావుల చిత్రాలతో కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ప్రతిపాదనపై ఈ కమిటీ అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే, భారత్కు గాంధీకంటే గొప్ప ప్రతినిధిగా నిలువగల వ్యక్తి ఎవరూ లేరని, కరెన్సీ నోట్లపై ఆయన ఒక్కరి చిత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ వివరాలను 2019లో ఆర్టీఐ సమాచారం కింద ఆర్బీఐ వెల్లడించింది.