ముంబై: హిందూత్వ అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు పార్టీల నేతలు పోటీపడి హిందూత్వ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ, ఆ పార్టీ సొంత పత్రిక అయిన సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్.. దేశంలో హిందూత్వ అంశంపై ఎన్నికల్లో పోటీపడుతున్న తొలిపార్టీ తమదేనని చెప్పుకొచ్చారు.
బీజేపీ నవ హిందూత్వవాదులకు (బీజేపీలోని కొత్త నేతలు) అసలు హిందూత్వ చరిత్రే తెలియదని ఆయన విమర్శించారు. కొందరు అవివేకులు తమ చరిత్రను తామే చెరిపేసుకుంటున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అయినా, తాము సమయం వచ్చినప్పుడల్లా హిందూత్వకు సంబంధించిన సమాచారాన్ని వాళ్లకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ, శివసేన పార్టీల మధ్య గత మూడు రోజులుగా వివాదం మొదలైంది. బీజేపీతో జట్టుకట్టడం ద్వారా తాము 25 ఏండ్ల సమయాన్ని వృథా చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. తాము హిందూత్వను గెలిపించడం కోసం బీజేపీతో కలిశామని, కానీ బీజేపీ మాత్రం తన గెలుపు కోసం హిందూత్వను వాడుకుంటున్నదని ఆరోపించారు.