ముంబై, జూన్ 24: పీఎం కేర్స్ ఫండ్స్పై ఈడీ విచారణ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ దర్యాప్తు సంస్థల పరిధిలోకి రాదా? అని ఆయన ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఠాక్రే మాట్లాడారు. కరోనా సమయంలో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దవాఖానల్లో మౌలిక వసతుల పేరిట నిధుల గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఠాక్రే వర్గానికి చెందిన నేతలపై సీఎం ఏక్నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. ఈ ఆరోపణలను ఠాక్రే తిప్పికొట్టారు.
పీఎం కేర్స్ పేరిట వసూలు చేసిన వేల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వాటికి సంబంధించిన లెక్కలు దర్యాప్తు సంస్థల పరిధిలోకి రావా అని నిలదీశారు. కేంద్రం గతంలో సమకూర్చిన నాసిరకమైన వెంటిలేటర్లు పాడైపోయాయని ఆరోపించారు. కొవిడ్ సమయంలో బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, గంగలో తేలియాడిన శవాలతో నిత్యం ఆ రాష్ర్టాలు వార్తల్లో నిలిచాయని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు గుజరాత్, యూపీతో పాటు నాగ్పూర్, పింప్రి-చించ్వాడ్, పుణే, థానే పురపాలక సంఘాలపై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.