ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిరసన తెలిపింది. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ని ధరాశివ్గా మారుస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం నిర్వహించిన చివరి కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ పేర్ల మార్పు చట్టవిరుద్ధమని షిండే ప్రభుత్వం విమర్శించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తామని, ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ని ధరాశివ్గా మార్చుతామని తెలిపింది.
మరోవైపు ఎంవీఏ ప్రభుత్వం మార్పు చేసిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను షిండే ప్రభుత్వం తిరిగి మార్చడంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కార్యకర్తలు ఔరంగాబాద్లో శనివారం భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. శివసేన తిరుగుబాటు నేత, సీఎం షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంవీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడాన్ని నిలిపివేయాలని, ఆ ప్రభుత్వం ఖరారు చేసిన పేర్లను మార్చవద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారీగా బ్యానర్లు, కటౌట్లు ప్రదర్శించారు. కాగా, శివసేన రెబల్ నేత షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన నుంచి ఇంత భారీ స్థాయిలో నిరసన వ్యక్తం కావడం ఇదే తొలిసారి.