ముంబై: పొత్తు ధర్మాన్ని శివసేన పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బృహన్ ముంబై నగరపాలక (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు వారాంతంలో సమావేశమయ్యారు. వార్డుల పునర్విభజనపై చర్చించారు. మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శివసేనపై ముంబై కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేశారు. పొత్తు ధర్మాన్ని శివసేన పాటించడం లేదని, బీఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ను బలహీనపర్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, పలు వార్డు సభ్యులపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత, బీఎంసీలో ప్రతిపక్ష నేత రవి రాజా మండిపడ్డారు. వార్డుల రిజర్వేషన్లు మారడంతో 21 మంది కాంగ్రెస్ నేతలపై ప్రభావం చూపుతుందన్నారు.
కాగా, రానున్న బీఎంసీ ఎన్నికల్లో 60-65 స్థానాల్లో విజయంపై దృష్టిసారించామని రవి రాజా తెలిపారు. దీని కోసం ముంబైలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవాలని, పార్టీకి నష్టం జరుగకుండా, ఉనికిని కోల్పోకుండా చూడాలని కోరారు.