న్యూఢిల్లీ: గోవాలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకుతోడు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన పార్టీ కూడా గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. మహారాష్ట్ర అధికార కూటమిలో కాంగ్రెస్తో కలిసి భాగస్వాములుగా ఉన్న శివసేన, ఎన్సీపీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
ఈ విషయాన్ని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. అయితే, ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో రెండు పార్టీల ప్రతినిథులు ఈ నెల 18న నిర్ణయం తీసుకోనున్నారని ఆయన చెప్పారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ జనవరి 18న స్థానిక నాయకులతో కలిసి సీట్ షేరింగ్పై చర్చలు జరుపనున్నారని తెలిపారు.
అయితే, మహారాష్ట్రతో పోల్చితే గోవాలో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయని సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని.. అయితే గోవాలో మాత్రం శివసేన, ఎన్సీపీ కలిసి పోటీచేయనుండగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతున్నదని రైత్ తెలిపారు. ఫిబ్రవరి 14న ఒకే విడుతలో గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.