ముంబై : యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండకు నిరసనగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈనెల 11న మహారాష్ట్ర బంద్కు పిలుపుఇచ్చాయి. ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించడం, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత రైతు కుటుంబాలను కలిసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నో నుంచి సీతాపూర్కు బయలుదేరారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై మోదీ సర్కార్ పధకం ప్రకారం దాడులకు పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు.