ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. తాజాగా మరో ఎమ్మెల్యే సైతం ఆయన గూటికి చేరనున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సమంత్ సైతం గౌహతికి బయలుదేరారు. ఆయన సైతం షిండే శిబిరంలో చేరే అవకాశం ఉన్నట్లుగా జరుగుతున్నది. ఇదే జరిగితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ ఎనిమిదో మంత్రి షిండే వర్గంలో చేరనున్నారు.
ఉదయ్ సమంత్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్య, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత, మంత్రి ఆదిత్య ఠాక్రే మరోసారి ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శివసేన పార్టీలోకి తిరిగి రావాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉన్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. దేశ వ్యతిరేకులైన రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. మరో వైపు చాలా మంది తిరుగుబావుటా ఎగురవేసి అసోంకు వెళ్లారని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు ప్రారంభించామని, ఇప్పటి వరకు 16 మందికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.