చండీగఢ్: హర్యానా రాష్ట్ర నూతన డీజీపీ (Director General of Police – DGP) గా 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి శత్రుజీత్ సింగ్ కపూర్ (Shatrujeet Singh Kapoor) నియమితులయ్యారు. మంగళవారం వరకు డీజేపీగా కొనసాగిన పీకే అగర్వాల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 నాటికి పీకే అగర్వాల్ పదవీ కాలం ముగియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
కాగా, హర్యానా డీజీపీ నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ కసరత్తే చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో డీజీపీ పదవి కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను షార్ట్లిస్ట్ చేసింది. వారిలో 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ఆర్సీ మిశ్రా, మహమ్మద్ అకిల్, 1990 బ్యాచ్కు చెందిన శత్రుజీత్ సింగ్ కపూర్ ఉన్నారు.
అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ షార్ట్లిస్ట్ చేసిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఒకరిని తమ రాష్ట్ర డీజీపీగా ఎంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆ మేరకు హర్యానా సర్కారు ముగ్గురు అధికారుల్లో శత్రుజీత్ సింగ్ కపూర్ను తమ రాష్ట్ర డీజీపీగా నియమించుకుంది. ఆయన ఇవాళ్టి (ఆగస్టు 16) నుంచి కనిష్ఠంగా రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.